కేపీసీసీ అధ్యక్షుడితో భేటీ | - | Sakshi
Sakshi News home page

కేపీసీసీ అధ్యక్షుడితో భేటీ

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

సాక్షి బళ్లారి: కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా బీకే.హరిప్రసాద్‌ నియామకం కావడంతో ఆయన్ను నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి కలిశారు. ఆదివారం బెంగళూరులో కేపీసీసీ అధ్యక్షుడిని కలిసి పలు విషయాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, అభివృద్ధి, రాజకీయ అంశాలపై చర్చించారు. బళ్లారిలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడానికి శాయశక్తులా కృషి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు.

జూన్‌ 28 నుంచి పల్స్‌ పోలియో

రాయచూరు రూరల్‌: నగరంలో జూన్‌ 28 నుంచి పల్స్‌ పోలియో నిర్వహిస్తామని నగరసభ అదనపు కమిషనర్‌ శరణప్ప పేర్కొన్నారు. శనివారం నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో 37,983 మందికి చుక్కలు వేస్తారన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు 37,983 మందికి చుక్కలు వేయడానికి 132 కేంద్రాలు, 5 ట్రాన్సిట్‌ బూత్‌లు, 3 మొబైల్‌ టీంలు, 24 మంది సూపర్‌వైజర్లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు శాకీర్‌, చంద్ర శేఖరయ్య, ఈరణ్ణ, రవి, సరోజ, రామచంద్ర, ఈరమ్మ, తిక్కారెడ్డి, చెన్నమ్మ, జయపాల్‌ రెడ్డి, వరలక్ష్మిలున్నారు.

చేప మందు పంపిణీ

రాయచూరు రూరల్‌: నగరంలో శనివారం 100 మందికి చేప మందు పంపిణీ చేశారు. మృగశిర కార్తెలో ఆయాసం, ఉబ్బసం ఇతర వ్యాధులు సోకిన వారికి చేప మందు వాడడం వల్ల వ్యాధి నయం అవుతుందని నమ్మకం. ఈనేపథ్యంలో నగరంలోని జిల్లా జైలు సమీపంలోని మందుల దుకాణంలో డాక్టర్‌ అలీ కరోనా నిబంధనల మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేప మందును అందించారు.

విశాఖ రైలును పొడిగించాలి

రాయచూరు రూరల్‌: విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌ మధ్య నడుస్తున్న రైలును రాయచూరు వరకు నడపాలని రాయచూరు వాణిజ్యోద్యమ సంఘం డిమాండ్‌ చేసింది. శనివారం తుమకూరులో జరిగిన వాణిజ్యోద్యమ సంఘం సమ్మేళనంలో సంఘం అధ్యక్షుడు కమల్‌ కుమార్‌ జైన్‌ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రాయచూరు వాసులకు విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌ రైలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నారు. రైల్వే స్టేషన్‌ నుంచి యరమరస్‌కు గూడ్స్‌ షెడ్‌ను తరలించాలన్నారు. నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కేఎస్‌ఆర్‌ వరకు పొడిగించాలన్నారు. రెండో ప్లాట్‌ఫాంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. త్రివిక్రం జోషి, జంబణ్ణ, ఉదయ్‌కిరణ్‌లున్నారు.

కేసెట్‌లో విజయపుర విద్యార్థుల సత్తా

రాష్ట్ర స్థాయిలో 4, 6వ ర్యాంకుల సాధన

రాయచూరు రూరల్‌: కేసెట్‌ ఫలితాలు ప్రకటించడంతో విజయపుర జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. రాష్ట్ర స్థాయిలో 4, 6వ ర్యాంకులను సాధించారు. విజయపుర ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో చదివిన బసవరాజ్‌ పశు సంవర్ధక బీఎస్సీ నర్సింగ్‌లో 4, ఫార్మా బీ, డీలలో 6వ, యోగా న్యాచురోపతిలో 10వ ర్యాంకును పొందారు. రైతు కుటుంబంలో జన్మించిన బసవరాజ్‌ తాను నీట్‌లో మంచి ర్యాంక్‌ పొంది ఎయిమ్స్‌లో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఎక్సలెంట్‌ కళాశాల విద్యార్థిని అనూషా పశు సంవర్థకంలో 4, బీఎస్సీ అగ్రికల్చర్‌లో 3వ ర్యాంకును సాధించారు.

దొంగల ముఠా అరెస్ట్‌

హొసపేటె: తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నలుగురు దొంగలను విజయనగర జిల్లా కొట్టూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడిన నిందితులను కొట్టూరు పోలీసులు గుర్తించి, 50 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శికారి మదన్‌(30), గణేష్‌ (20), బాలచంద్ర (20), అశోక్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

బసవరాజ్‌

అనూషా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement