బళ్లారిటౌన్: నగరంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తమైంది. మోకా రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ జలమయమై విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు మధ్యాహ్నం వరకు పంపింగ్ చేసి నీటిని తొలగించారు. చాలా ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో కేఈబీ ఉద్యోగులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇక పొలాలు, లోతట్టు ప్రాంతాల్లోని వాన నీరు కప్పగల్ రోడ్డులోని హెచ్ఎల్సీ 14వ నంబరు ఉపకాలువలోకి చేరడంతో ఉప కాలువ నిండుగా ప్రవహించింది. ఇంకా డ్యాం నుంచి నీరు వదలలేదు. అయినా కాలువ నిండుగా ప్రవహించడంతో రైతులకు కూడా ఒకింత ఆశ్చర్యం కలిగించింది.
కలబుర్గి, సేడంలలో భారీ వర్షం
రాయచూరు రూరల్: కలబుర్గి, సేడంలలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిిసింది. సేడంలో ఎక్కడ చూసినా రోడ్లు బురద గుంటలుగా మారాయి. గంట పాటు వానలు కురిశాయి. కురిసిన వానలకు అంబేడ్కర్ సర్కిల్, జిల్లా పంచాయతీ కార్యాలయం, బస్టాండ్ వద్ద మురుగు కాలువలు పూర్తిగా నిండి రహదారులపై నీరు ప్రవహించాయి. అంగళ్లు, ఇళ్లలోకి నీరు చేరడంతో వాటిని తొలగించడానికి ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. కలబుర్గి జిల్లా సేడంలో కురిసిన భారీ వర్షానికి వంతెనపై గుండా నీరు పారాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భారీ వర్షానికి అతలాకుతలమైనా అమాత్య పదవి కోసం ఎమ్మెల్యే ఇంకా బెంగళూరులోనే మకాం వేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
లోతట్టు కాలనీలు జలమయం
రోడ్లపై ఏరులా పారిన నీరు


