హొసపేటె: హొసపేటె – కొప్పల్ పరిధిలో ఉన్న తుంగభద్ర నదిలో తేలుతున్న మృత దేహాన్ని వెలికితీసేందుకు సరిహద్దు వివాదంపై పోలీసులు పరస్పరం వాదులాడుకున్నారు. తుంగభద్ర నది విజయనగర, కొప్పళ్ జిల్లాలకు సరిహద్దుగా ఉంది. బుక్కసాగర్ వంతెన సమీపంలోని నదీ జలాల్లో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండగా గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. విజయనగర జిల్లా కమలాపూర్, కొప్పల్ జిల్లా గంగావతికి చెందిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే మృతదేహం పడి ఉన్న స్థలం తమ పరిధిలోకి రాదంటూ ఇరు జిల్లాల పోలీసులు వాగ్వాదం చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. మృతదేహాన్ని వెలికి తీయకుండా సరిహద్దుల గరించి చర్చించుకుంటారా అంటూ మండిపడ్డారు. చివరకు కమలాపూర్ పోలీసులు స్థానిక మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి గుర్తింపు ఇంకా నిర్ధారణ కాలేదు. ఇది ఆత్మహత్య లేక హత్యా అనే కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని వెలికి తీయకుండా పోలీసుల నిర్లక్ష్యం
అది తమ పరిధిలో లేదంటూ
విజయనగర, కొప్పళ జిల్లా పోలీసుల వాగ్వాదం
ఆగ్రహం వ్యక్తం చేసిన జనం
ఎట్టకేలకు మృతదేహం వెలికితీత


