అలంపూర్: తొలకరి వర్షం అన్నదాతలను మురిపిస్తోంది. ఇప్పటికే పంటల సాగులో నిమగ్నమైన రైతాంగానికి ఊరట కలిగిస్తోంది. వేసవి ఎండతో నెర్రెలుబారిన పంట పొలాలు వర్షపు నీటిలో ఓళలాడుతున్నాయి. బక్కచిక్కిని వాగులు వరద ప్రవాహంతో పారుతున్నాయి. వర్షానికి తోడు భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చినుకుపడినా.. గాలి వీచినా విద్యుత్ సమస్యతో అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో వర్షపాతం ఇలా..
జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున సైతం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో అత్యధికంగా 82.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. వడ్డేపల్లి మండలంలో అత్యల్పంగా 6.8 మి.మీ. వర్షం కురిసింది. అయిజలో 44.5 మి.మీ., మానవపాడులో 18.5 మి.మీ., ఇటిక్యాలలో 11.8 మి.మీ., రాజోళిలో 25.5 మి.మీ., ఉండవెల్లిలో 15.2 మి.మీ., అలంపూర్ మండలంలో 9.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే విధంగా గద్వాల నియోజకవర్గంలోని ధరూరులో 43.9 మి.మీ., గద్వాలలో 11.3 మి.మీ., మల్దకల్లో 9.6 మి.మీ., గట్టులో 39 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం కురిసిన వర్షానికి అక్కడక్కడ వాగులు, వంకలు పారుతున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
అత్యధికంగా
కేటీదొడ్డిలో 82.8 మి.మీ.
అత్యల్పంగా వడ్డేపల్లిలో 6.8 మి.మీ.
తడిసిన పంట పొలాలు.. సాగు పనుల్లో రైతన్నలు


