గట్టు: జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఆరు వరుసల జాతీయ రహదారికి గట్టు మండలానికి కనెక్టివిటీ కల్పించే అప్రోచ్ రోడ్డు, రాయాపురం డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 116వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా నిర్మించే జాతీయ రహదారి విషయంలో అధికారులు అవసరమున్న చోట కాకుండా అవసరం లేని చోట వంతెన నిర్మాణం చేపట్డడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. డబుల్ రోడ్డు ఉన్న చోటే వంతెన నిర్మాణం చేపట్టాలని, కొత్త రోడ్డుపైకి గట్టు మండల ప్రాంత ప్రజలు చేరుకునేలా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు కనెక్టివిటీ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడ్డారు. రిలే దీక్షలను కొనసాగిస్తున్న వారు మహాబూబ్నగర్లోని జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ అధికారి భన్సల్కుమార్ను కలిసి విన్నవించారు.
అధికారుల బృందం పరిశీలన..
గట్టు మండలంలో ఆందోళన కొనసాగుతున్న ప్రాంతాన్ని జాతీయ రహదారి నిర్మాణ సంస్థ రీజినల్ అధికారి శివశంకర్, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ మహబూబ్నగర్ అధికారి భన్సల్కుమార్, టెక్నికల్ మేనేజర్ తోటబాబు, మెగా ప్రాజెక్టు మేనేజర్ వినోద్కుమార్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ అసదుల్లా పరిశీలించారు. రాయాపురం స్టేజీతోపాటు పాత ఆలూరు దారిలో నిర్మించిన వంతెనను అధికారులు పరిశీలించి వెళ్లారు. వంతెన ప్రతిపాదన విషయంలో ఇంజినీరింగ్ అధికారుల తప్పిదాన్ని గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంత ప్రజల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు చెప్పారు.


