● అదనపు కలెక్టర్ నర్సింగ్రావు
గద్వాల(మల్దకల్): దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు కోరారు. బుధవారం మల్దకల్ మండలం నేతువానిపల్లిలో సర్పంచ్ పద్మమ్మ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. జనగణన ప్రక్రియలో భాగంగా ఇళ్ల లెక్కింపు చేపట్టడం జరిగిందని.. ప్రతి కుటుంబం తమ వివరాలను ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా రైతులకు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి.. వారి విద్యాభివృద్ధికి కృషి చేయా లని కోరారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఉపసర్పంచ్ మునినాయక్, పంచాయతీ కార్యదర్శి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


