గట్టు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం గట్టు మండల మహిళా సమాఖ్య భవనంలో ఉచిత కుటుంబ సలహా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడా రు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందన్నారు. కుటుంబపరంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వినూత్న ఆలోచనలతో పరిష్కరించుకునేందుకు ఉచిత సలహా కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని.. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వేసవిలో కిషోర బాలికలకు నిర్వహించిన ఆటల పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి బహుమతులను అందజేసి అభినందించారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వెంకటేశ్వరి, ఏపీఎం మారుతి, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, నాయకులు రామకృష్ణారెడ్డి, అలీ, శ్రీనివాస్రెడ్డి, రాజప్ప, గద్వాల తిమ్మప్ప, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


