జిల్లా కేంద్రంలో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం
● 10శాతం స్థలాలపై
బడా నాయకుల కన్ను
● చోద్యం చేస్తున్న అధికారులు
● నోటీసులతోనే సరిపెడుతున్న వైనం
గద్వాల: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లా ఏర్పాటు అనంతరం జమ్మిచేడు, దౌదర్పల్లి మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. ప్రభుత్వ భూములు, 10శాతం స్థలాలు రూ.కోట్లలో ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిపై కన్నేశారు. వీరికి కొందరు అవినీతి అధికారులు తోడుకావడంతో మున్సిపాలిటీ అక్రమ కట్టడాలకు నిలయంగా మారింది. రూ.కోట్ల విలువజేసే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది.
20ఫీట్ల సర్వీస్రోడ్డు సైతం..
ఆర్వోబీ నుంచి జములమ్మ ఆలయం వరకు ప్రధానరోడ్డు పక్కన భవిష్యత్ అవసరాలను దృిష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 20ఫీట్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసింది. అయితే సర్వీస్ రోడ్డును ఆక్రమిస్తూ.. సమీపంలో పలు నిర్మాణాలు వెలిశాయి. దీంతో 20ఫీట్ల సర్వీస్రోడ్డు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సర్వీస్ రోడ్డు పక్కన ఏమైనా నిర్మాణాలు చేపడితే, కచ్చితంగా సెట్బ్యాక్ స్థలం వదిలేసి మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలనే నిబంధనలు ఉన్నారు. కానీ ఇవేవి అమలుకు నోచుకోవడం లేదు.
అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు..
గద్వాల కొత్త హౌసింగ్బోర్డుకు వెళ్లే మార్గం, ఫైర్స్టేషన్కు వెనకాల ఓ ప్రైవేటు ఆస్పత్రి పక్కన నిర్మించే భవనం, అదే విధంగా కోర్టుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్ పక్కన నిర్మిస్తున్న నిర్మాణాలకు ఎక్కడా సరైన అనుమతులు లేవు. తీసుకున్న అనుమతులు, చేపడుతున్న నిర్మాణాలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. పైగా నిర్మాణాలు అన్ని కూడా ప్రధాన రహదారుల వెంట నిర్మిస్తున్నవే. వీటికి కచ్చితంగా సెట్బ్యాక్ చేస్తూ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు.
పట్టింపులేని అధికారులు..
గద్వాల మున్సిపాలిటీలో విలువైన 10శాతం స్థలా లు అన్యాక్రాంతం అవుతున్నాయి. ముఖ్యంగా కొ న్ని కులాలకు ఇష్టానుసారంగా 10శాతం స్థలాలను అప్పనంగా కట్టబెట్టారు. అదే విధంగా భీంనగర్లోని ఓ ప్రైవేటు కాలేజీ సమీపంలో ఏకంగా రహదారిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇక్కడ చేపట్టిన అక్రమ నిర్మాణం వెనకాల పలుకుబడి గల నాయకుడు ఉండటమే కారణమని తెలుస్తోంది.


