గల్ప్ దేశాలకు ఇరాన్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ నుంచి నాలుగింతలు దాడి చూడాలనుకుంటేనే అమెరికా మద్దతు విషయంలో ముందుకెళ్లాలని, ఈ తరుణంలో జరిగే పరిమాణాలకు మీరే బాధ్యత వహించాలని ఇరాన్ హెచ్చరించింది. యుద్ధానికి సంబంధించి రెండో విడత శాంతి చర్చలు ఇంకా అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో తమ పొరుగు గల్ఫ్ దేశాలు ఏమైనా అమెరికాకు మద్దతు ఇస్తే మాత్రం ఈసారి తమ నుంచి భీకర దాడి చూడాల్సి వస్తుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఎస్మాయిల్ సాగాబ్ ఎస్ఫహానీ హెచ్చరించారు.
ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న నిర్బంధం కారణంగా తమ మౌలిక వసతులు, ముఖ్యంగా చమురు బావులు, దెబ్బతింటే మాత్రం నాలుగు రెట్లు ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వాలని భావించే గల్ఫ్ దేశాలు కాస్త వెనక్కి తగ్గితేనే మంచిదని, లేని పక్షంలో తమ నుంచి ఈసారి వచ్చే ప్రతిస్పందన మీ ఊహకు కూడా అందదని ఎస్ఫహానీ ముందస్తు సంకేతాలు పంపారు.
‘మా లెక్కలు వేరుగా ఉంటాయి. ఒక చమురు బావి అంటే నాలుగు చమురు బావుల నష్టం, అమెరికాకు మద్దతిస్తే మాకు భారీ నష్టాన్ని తేవడంలో మీ వంతు పాత్ర కూడా ఉందనే అనుకుంటాం. అందుకు ప్రతి స్పందన కూడా నాలుగింతలే ఉంటుంది’ అని పేర్కొన్నారు.
గత వారం, తన ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్.. ఇరాన్ను కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థగా రాసుకొచ్చారు. ‘ ఇరాన్ ఆర్థికంగా కూలిపోతోంది. వారు హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని కోరుకుంటున్నారు . నగదు కోసం ఆకలితో ఉన్నారు. రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. సైన్యం, పోలీసులు జీతాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి’ అని తెలిపారు.


