అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. ఇప్పుడు తాజాగా.. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థలోని 20శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.
గత సంవత్సరం నుంచి కంపెనీ సీఈఓ జుకర్బర్గ్ ఏఐలో పెట్టుబడులను విపరీతంగా పెంచుతున్నారు. మెటా ఉత్పాదకను పెంచడంలో భాగంగా.. తగిన చర్యలు తీసుకుంటోంది. ఇది సంస్థలోని 16,000 ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే లేఆఫ్స్ ఎప్పుడు ఉంటాయనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. కాగా కంపెనీలో డిసెంబర్ 31 నాటికి దాదాపు 79,000 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.
మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని సంస్థ ఏఐ స్టార్టప్లను కొనుగోలు చేయడానికి బిలియన్ల కొద్దీ ఖర్చు చేసింది. చైనీస్ ఏఐ స్టార్టప్, మనుస్ను కొనుగోలు చేయడానికి కంపెనీ కనీసం 2 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. మానవులు పోస్ట్ చేయడానికి అనుమతించని ఏఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన మోల్ట్బుక్ను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను కూడా ఇటీవల ప్రకటించింది.
ఏఐ కారణంగా లేదా ఏఐను ఉపయోగించుకోవడంలో భాగంగా.. ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా మాత్రమే కాకుండా.. అమెజాన్, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, SaaS దిగ్గజం అట్లాసియన్ కూడా ఉన్నాయి. జనవరిలో అమెజాన్ తన శ్రామిక శక్తిలో 1 శాతం లేదా దాదాపు 16,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అట్లాసియన్ కూడా AIపై ఎక్కువ ఖర్చు చేయడానికి 1,600 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.


