పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హార్మూజ్ జలసంధి పునరుద్ధరణ, ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి కీలకంగా మారనుంది.
హార్మూజ్ జలసంధి పునరుద్ధరణ
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సంతోషంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ‘హార్మూజ్ జలసంధి తెరిచినందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎంతో సానుకూలంగా ఉన్నారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చైనా ఇంధన అవసరాలకు భారీ ఊరట లభించనుంది. బీజింగ్ నుంచి వస్తున్న ఈ సానుకూల సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఆశాభావాన్ని నింపుతున్నాయి.
ఇరాన్ అణు నిల్వలు - చైనా వ్యూహాత్మక పాత్ర
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ యురేనియం. తాజా దౌత్య చర్చల ప్రకారం.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించడంలో లేదా వాటిని తన ఆధీనంలోకి తీసుకోవడంలో చైనా మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అటు వాషింగ్టన్, ఇటు టెహ్రాన్ మధ్య నేరుగా ఘర్షణ పడకుండా సమస్యను పరిష్కరించే మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల గ్లోబల్ పాలిటిక్స్లో చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ చైనా పర్యటన
త్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు వెల్లడించిన ట్రంప్, ఈ పర్యటన ప్రత్యేకమైనదని, చారిత్రాత్మకమైనదన్నారు. ‘షీ జిన్పింగ్తో భేటీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సమావేశం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించబోతున్నాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ అణు ఒప్పందంపై ప్రతిష్టంభనను తొలగించడానికి చైనాను ఒక బఫర్గా వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ తన యురేనియం నిల్వలను చైనాకు తరలించడానికి అంగీకరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ!


