వేదాంత ఛైర్మన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు | Chhattisgarh Vedanta Plant Blast FIR Against Chairman Anil Agarwal 20 Deaths | Sakshi
Sakshi News home page

వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

Apr 17 2026 8:32 AM | Updated on Apr 17 2026 8:41 AM

Chhattisgarh Vedanta Plant Blast FIR Against Chairman Anil Agarwal 20 Deaths

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత గ్రూప్ విద్యుత్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 14న జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సింగితరై గ్రామంలోని ప్లాంట్‌లో బాయిలర్ నుంచి టర్బైన్‌కు అధిక పీడనంతో ఆవిరిని తీసుకెళ్లే స్టీల్ ట్యూబ్ ఒక్కసారిగా పేలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

చట్టపరమైన చర్యలు

శక్తి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రఫుల్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, దబ్రా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద కొన్ని సెక్షన్లను నమోదు చేశారు.

  • సెక్షన్ 106: నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం కావడం.

  • సెక్షన్ 289: యంత్రాల నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరించడం.

  • సెక్షన్ 3(5): కామన్‌ ఇంటెన్షన్‌

‘ఎఫ్ఐఆర్‌లో ఛైర్మన్ అనిల్ అగర్వాల్ సహా 8 నుంచి 10 మంది వ్యక్తుల పేర్లను చేర్చాము. దర్యాప్తులో మరింత మంది బాధ్యుల పేర్లు వెలుగులోకి వస్తే వారిని కూడా నిందితులుగా చేరుస్తాం’ అని ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ వెల్లడించారు.

దర్యాప్తు ముమ్మరం

ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పేలుడు కారణాలను అన్వేషించడానికి నిపుణులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతుల పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ విశ్లేషణ, పారిశ్రామిక భద్రతా విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ నివేదికలు అందిన తర్వాత అవసరమైతే మరిన్ని కఠిన సెక్షన్లను జోడించే అవకాశం ఉంది.

ఈ ప్రమాదంపై రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్లాంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదుతో సరిపెట్టకుండా ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పట్టుబట్టింది. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరింది.

ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Advertisement
 
Advertisement
Advertisement