తాడేపల్లి : ఏపీలో పారిశ్రామిక వేత్తలకు వేధింపులు తప్పడం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వర్గాలపై రెడ్ బుక్ పాలనను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాంతో ఏపీలో పారిశ్రామిక వర్గాలకు ఇదొక శాపంలా మారిందన్నారు.
‘ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకు వాటాలను సెటిల్మెంట్ చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీవలే సీఎంను కలిశారు. ఆ తర్వాత అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని రకాలుగా బెదిరించినా యాజమాన్యం స్పందించక పోవటంతో మరింత రెచ్చిపోతున్నారు. చంద్రబాబు పాలనను కమ్మగా ఉందంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎంతో సెటిల్మెంట్ చేసుకున్నారు. తన అనుచరులతోనే ఆల్ట్రాటెక్ పై అనేక ఫిర్యాదులు చేయించారు. తర్వాత పరిశ్రమ వాహనాలను కట్టడి చేశారు..
అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నారు.. జిందాల్ కంపెనీ వారిని కూడా ఇలాగే వేధించారు. వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళిపోయారు. ఇలా కూటమి నేతలు పలు కంపెనీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. పారిశ్రామికవేత్తలను ఇలా బెదిరిస్తుంటే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు?, రాష్ట్రానికి మేం ఎన్ని పరిశ్రమలు తెచ్చాం.. మీరు ఎన్ని తెచ్చారో లెక్క చెప్పాలి. పారిశ్రామిక వర్గాలపై బెదిరింపులు ఆపాలి’ అని టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు.


