MP Vijaya Sai Reddy: ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి

Vijaya Sai Reddy Comments On Andhra Pradesh Special Status - Sakshi

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రత్యేకహోదాతోనే సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. తమను పట్టించుకోని కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మాదిరిగానే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా తిరస్కరించారని తెలిపారు. రాజ్యసభలో సోమవారం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో మౌలికసదుపాయాలు, సరిహద్దు వ్యాపారం అభివృద్ధి చెందాయని ప్రశంసించారు. విభజన అనంతరం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే ప్రత్యేకహోదా కల్పించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి మాజీ ప్రధాని మన్మోహన్‌ సభలో ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం గౌరవించాలని కోరారు. విభజన చట్టంలోని అనేక లోపాలను బీజేపీ అనుకూలంగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎగ్గొడుతోందని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ చేసిన ప్రకటన నాడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం చట్టంలో చేర్చకపోవడం వల్లనే ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top