చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలపై కొందరు టీడీపీ నేతలు సీఎంఓ ఆఫీసుకు ఫిర్యాదు చేశారనే విషయం కలకలం రేపుతోంది. మంగళవారం ప్రచురితమైన వార్తా కథనంతో మండలంలో ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు చేసిన ఆ నేతలు ఎవరంటూ..సొంత పార్టీలోనే చర్చలు మొదలయ్యాయి. ఫిర్యాదు చేసిన నేతలను తెలుసుకునేందుకు టీడీపీలోని ఓ వర్గ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొంత మందిపై అనుమానం ఉన్నా కక్కలేక..మింగలేక లోలోపాల తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఫిర్యాదు విషయంలో కప్పి పుచ్చే ప్రయత్నాలు జరిగితే...రోడ్డుపైకి రావడం ఖాయమని..అందరి చిట్టా విప్పుతామని మరో వర్గ నేతలు బహిరంగంగా చెబుతుండడంతో ఈ యవ్వారం రసకందాయంలో పడింది.


