సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమ నిర్బంధించారు. ఈరోజు ఉదయం తాడేపల్లి నివాసానికి వస్తుండగా పోలీసులు.. శ్రీహరిని అడ్డుకుని తీసుకెళ్లిపోయారు.
వివరాల మేరకు.. ఏపీ పోలీసులు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా తమ వాహనంలో తీసుకువెళ్లారు. శ్రీహరిని బెదిరించి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ సమయంలో శ్రీహరితో పాటు ఉన్న వ్యక్తిని బెదిరించారు. తమ వెనకాల ఫాలో అయితే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. శ్రీహరి ఫోన్, ల్యాప్టాప్ను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. అయితే, శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్లారో, ఏ కేసులో తీసుకెళ్లారు అనే విషయాలను మాత్రం పోలీసులు చెప్పలేదు.
అయితే, పోలీసుల అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, శ్రీహరి అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే మరోసారి పోలీసులు.. పూడి శ్రీహరి ఇంటికి వచ్చారు. శ్రీహరి ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.



