సినీఫక్కీలో డ్రగ్స్ తరలిస్తున్న మహిళను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్: సినీఫక్కీలో డ్రగ్స్ ను తరలిస్తున్న ఓ మహిళను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలను కడుపులో పెట్టుకుని తరలించడానికి ప్రయత్నించిన విదేశీ మహిళ పోలీసులకు చిక్కింది.
వివరాలు.. మూసియా మూసా(32) అనే నైజీరియా మూలాలున్నఅమెరికా మహిళ ఈకే 526 ఎమిరేట్స్ విమానంలో ఆదివారం ఉదయం దుబాయ్ మీదుగా శంషాబాద్ చేరుకుంది. అనంతరం సదరు మహిళను అధికారులు తనిఖీ చేయగా నివ్వెర పోయే విషయాలు వెలుగు చూశాయి. మహిళ శరీరంలో లక్షల రూపాయిలు విలువైన బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం కస్టడీలో తీసుకున్న పోలీసులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. బ్రౌన్ షుగర్ ను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఆమెకు ఇంజక్షన్లు ఇచ్చి బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను తీసేందుకు యత్నాలు ఆరంభించారు.
అగస్టు 23న జొహెన్నెస్ బర్గ్ నుంచి దుబాయ్కు మూసా వెళ్లింది.అదే రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చింది. అదే రోజు మళ్లీ జొహెన్నెస్ బర్గ్కు తిరిగి వెళ్లిపోయింది. అగస్టు 29న గౌరలహాస్ నుంచి దుబాయ్కు చేరుకుంది. ఆదివారం ఉదయం హైదరాబాద్కు వచ్చింది.తన ఫ్లైట్ టికెట్లో ఎక్కడా అడ్రస్ను మూసా మెన్షన్ చేయలేదు.
ప్రస్తుతం 100 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను మాత్రమే బయటకు తీశామని.. ఇంకా 500 గ్రాముల వరకూ బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు ఉండే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ ఇంజక్షన్ల ద్వారా సాధ్యం కాకపోతే సర్జరీ చేసి బయటకు తీయాల్సి వస్తుందని అంటున్నారు. ఆ బ్రౌన్ షుగర్ విలువ దాదాపు రూ. 50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.