కశ్మీర్ ప్రాంతంలోని ఉరి ఆర్మీ క్యాంపుపై చెలరేగిన ఉగ్రవాదులు, ఆ దాడిని స్వాతంత్ర్య దినోత్సవం రోజే చేయాలని ప్లాన్ చేశారట.
ఆగస్టు 15నే ఉగ్రదాడికి ప్లాన్!
Sep 23 2016 5:57 PM | Updated on Jul 12 2019 4:35 PM
కశ్మీర్ ప్రాంతంలోని ఉరి ఆర్మీ క్యాంపుపై చెలరేగిన ఉగ్రవాదులు, ఆ దాడిని స్వాతంత్ర్య దినోత్సవం రోజే చేయాలని ప్లాన్ చేశారట. రెడ్ ఫోర్ట్పై ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ దాడికి పాల్పడాలని ఉగ్రవాదులు వ్యూహాలు పన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. కానీ ఆ టెర్రర్ అటాక్ను ఆర్మీ తిప్పికొట్టిందని చెప్పారు. ఎల్ఒసి మాయన్ ప్రాంతంలోని ఉరి సమీపంలో జైషే-ఇ-మహ్మద్కు చెందిన ఫిదాయీన్ స్కాడ్లోని నలుగురు సభ్యులను ఆర్మీ హతమార్చింది. దీంతో అప్పుడు విఫలమైన ఈ ఉగ్రదాడిని అదే టెర్రర్ గ్రూపు సెప్టెంబర్ 18న ఉరిలోని ఆర్మీస్థావరంపై జరిపారు. నిద్రపోతున్న ఆర్మీ జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు పేర్కొన్నారు.
కళ్లు మూసి తెరిచేలోపు 18 మంది ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఆర్మీ క్యాంపుకు దగ్గర్లోని దట్టమైన అడవులను, మొక్కజొన్న పంటలను అవకాశంగా మలుచుకుని మిలిటెంట్లు ఈ ఘాతుకానికి తెగబడట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ భీకరమైన దాడి చేసిన వారు కూడా అచ్చం ఆర్మీ వాళ్ల లాగా హైయిర్ కట్ను కలిగిఉండి, నీటుగా సేవ్ చేసుకుని వచ్చారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఉగ్రవాదులు ఇలా తయారైనట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారతసైన్యం వారి నుంచి నాలుగు ఏకే 47 రైఫిళ్లు, నాలుగు అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న అనుమానంతో ఉరి చుట్టుపక్కల ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. ఈ ఘటనపై ఎన్ఐఏ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తోంది.
Advertisement
Advertisement