పనిచేయకపోతే..పంపించేస్తాం | face suspension if not work properly | Sakshi
Sakshi News home page

పనిచేయకపోతే..పంపించేస్తాం

Oct 8 2014 12:15 AM | Updated on Sep 2 2017 2:29 PM

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగులకు సమగ్ర వైద్య సేవల్ని అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు సాంబశివరావు పేర్కొన్నారు.

మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట జోన్: ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగులకు సమగ్ర వైద్య సేవల్ని అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు సాంబశివరావు పేర్కొన్నారు. సిద్దిపేట, మెదక్ ఏరియా ఆస్పత్రుల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆయన పలు విభాగాలను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సాంబశివరావు తీవ్రంగా హెచ్చరించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలందించాలన్నారు. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా విధుల్లో ఉండాలన్నారు. విధులకు గైర్హాజర్ కావడం, రోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఏరియా ఆస్పత్రుల్లో నిర్వహించే అత్యవసర సేవలకు సంబంధించి తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 325 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం 107 జీఓను విడుదల చేయడం జరిగిందన్నారు.
 
అందులో భాగంగానే మెదక్ జిల్లాలోని 21 పోస్టులకు గానూ 160 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ఆదేశాల మేరకు మెదక్ ఏరియా ఆస్పత్రిలో త్వరలోనే బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో పలు విభాగాల ను సాంబశివరావు సందర్శించారు. బ్లడ్ బ్యా ంక్ పని తీరు, ఓపీ, ల్యాబ్, స్టోర్‌రూం, వీ ఆర్‌టీ కేంద్రాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుక్క కాటుకు మం దులు సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌లో పుష్కలంగా ఉన్నాయని ప్రతిపాదనలు పంపి సిద్దిపేటకు తెప్పించుకోవాలని స్టోర్ ఇన్‌చార్జిని ఆదేశిం చారు. అనంతరం ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.  
 
నవజాత శిశు సంరక్షణ కేంద్రం..
సిద్దిపేటలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించడానికి చర్యలు చేపడతామన్నారు. బ్లడ్ బ్యాంక్‌ల పనితీరును మెరుగుపర్చడం, 104 వాహనంలో అవసరమైతే తాత్కాలిక వైద్యుల నియామకానికి కృషి చేస్తామన్నారు. కు.ని. శిబిరాలకు కనీస మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్ర, రక్త, ఈజీసీ, అల్ట్రా, ల్యాబ్ లాంటి పరీక్షలను బయటకు రాస్తే ఊరుకోబోమన్నారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి బాలాజి పవర్, క్లస్టర్ అధికారులు సునీల్,శివానందం, ఆస్పత్రుల సూపరింటెండెంట్స్ పీసీ శేఖర్,  శివరాం, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement