ఒంటేరుపై చర్యలు తీసుకోండి: టీఆర్‌ఎస్‌ | Sakshi
Sakshi News home page

ఒంటేరుపై చర్యలు తీసుకోండి: టీఆర్‌ఎస్‌

Published Tue, Nov 6 2018 3:14 AM

TRS complains to electoral officer against V Pratap reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌ నియోజకవర్గంలో తన మామ కేసీఆర్‌ను ఓడించాలని మంత్రి హరీశ్‌రావు కోరి నట్లు ఆరోపణలు చేసిన టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు ఓటర్లకు డబ్బులు పంచాలని సూచించిన బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ స్వామి పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ పార్టీ సోమవారం ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది.

అనం తరం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ప్రతాప్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మునుగోడు నియోజ కవర్గం పరిధిలోని చౌటుప్పల్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ ప్రచార ర్యాలీలో ఓటర్లకు రూ. 200 ఇచ్చి ప్రలోభాలకు గురి చేయాలని కోరిన స్వామి పరిపూర్ణానందపై సైతం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని పార్టీ నేత విఠల్‌ తెలిపారు. డబ్బులిస్తే ప్రజలు ఓట్లేస్తారని చెప్పడం ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలందరినీ అవమానించారని పార్టీ నేత ఉపేంద్ర అన్నారు.

పరిపూర్ణానందవి పగటి కలలు: కర్నె
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత పరిపూర్ణానంద తనకు తాను యోగి ఆదిత్యనాథ్‌లా ఊహించుకుని పగటి కలలు కంటున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. ప్రవచనాలు చెప్పేందుకు స్వామి డబ్బులు తీసుకుంటారేమోనని.. అందుకే ప్రజలు డబ్బులు తీసుకుని సభలకు వస్తారని హేళనగా మాట్లాడారని చెప్పారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

‘బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదు. రాజకీయాలంటే ఛారిటీ కాదని మాట్లాడిన రాంమాధవ్‌ కూడా టీఆర్‌ఎస్‌ పై విమర్శలు చేస్తున్నారు. పరిపూర్ణా నందస్వామి రాజకీయాలు ఇక్కడ నడవవు. మత రాజకీయాలతో బీజేపీకి తెలంగాణలో ఓట్లు పడవు. టీపీసీసీ అధికారిక ట్విట్టర్‌లో అన్నీ అబద్ధాలను ప్రచారం చేస్తోంది’ అని అన్నారు.

Advertisement
Advertisement