
సాక్షి, జడ్చర్ల : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప పాదయాత్ర కోసం ఆదివారం హైదరాబాద్ నుంచి కడప వెళ్తూ మార్గమధ్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో 44వ నెంబర్ జాతీయరహదారిపై కొద్దిసేపు ఆగారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ ఆధ్వర్యంలో గట్టు శ్రీకాంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా జడ్చర్ల అసెంబ్లీలో పార్టీని పటిష్టం చేసేందుకు తీవ్రంగా కృషిచేయాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.