
'నాన్న కల నెరవేరుతుందో లేదో తెలియదు'
ఉగ్రరక్కసి దురాఘతానికి బలైన భారత జవాన్ల కుటుంబ పరిస్థితులు అనూహ్యంగా ప్రశ్నార్థకంగా మారాయి.
పాట్నా: ఉగ్రరక్కసి దురాఘతానికి బలైన భారత జవాన్ల కుటుంబ పరిస్థితులు అనూహ్యంగా ప్రశ్నార్థకంగా మారాయి. చనిపోయిన ఒక్కో జవాను కుటుంబంలో ఒక్కో గాథ. మొత్తం కొడుకులందరనీ ఆర్మీకి పంపించి దేశంకోసం కడుపుకోతను అనుభవించిన తండ్రి గాథ ఒకటయితే.. అదే కొడుకును పోగొట్టుకొని కాస్తంత బాధ కాస్తంత ఆవేశాన్ని, ఏమీ చేయలేని నిస్సహాయతన వ్యక్తం చేసి ఆర్మీ అంటేనే అసహ్యించుకునే పరిస్థితికొచ్చిన ఓ తండ్రిది మరో గాధ.
మరో వైపు, ఎప్పుడో ఒకసారి వచ్చి వెళుతూ దూరంగా శత్రుమూకలతో పోరాడే తమ తండ్రుల ఆశయాలు ఎలాగైనా నెరవేర్చాలనే ఆలోచనతో చదువుబాటలో సాగుతున్న చిన్నారుల ఆశయాలు.. అయితే దురదృష్టవశాత్తు ఉగ్రవాదులు జరిపిన దాడి తమ వీర తండ్రుల ప్రాణాలు తీయడమే కాదు.. వారి లక్ష్యాలను సైతం బలహీనపడేలా చేసింది. మనోధైర్యాన్ని సన్నగిల్లేలా చేసింది. ఆ గమ్యాన్ని చేరుకుంటామో లేదో.. తమ కుటుంబానికి ఇక అండగా ఎవరుంటారో అని ఆ పసి హృదయాలు తల్లడిల్లుతున్నాయి.
గత ఆదివారం యూరీ సెక్టార్లోని ఆర్మీ ప్రధాన క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 18మంది సైనికులు చనిపోయారు. వీరిలో గయకు చెందిన మథుర యాదవ్ కుమారుడు నాయిక్ సునీల్ కుమార్ ఉన్నాడు. అతడి అంత్యక్రియల సందర్భంగా మథుర యాదవ్ మాట్లాడుతూ దాడి ఘటనకు సంబంధించి భారత్ గట్టి చర్యలు తీసుకోకుంటే తన కొడుకులెవ్వరినీ మరోసారి భారత ఆర్మీలో చేర్పించబోనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో భారత్ పాక్ ఉగ్రవాదుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. కాగా, సునీల్ కుటుంబమంతా ఆయన మరణంతో విషాదంలో మునిగిపోయింది. ఆయనకు ఆరతి(13), ఆన్షికా(8) అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిద్దరు పరీక్షలు హాజరైన తర్వాతే తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనిపై ప్రశ్నించగా ఎలాంటి అవాంతరాలు ఎదురైనా పరీక్షలను పక్కకు పెట్టొద్దని, పరీక్షల విషయంలో అస్సలు రాజీపడవొద్దని తన తండ్రి చెప్పేవాడని చెప్పారు.
ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేయించడం తన తండ్రి కల అని, అలాగే, చెల్లెల్ని డాక్టర్ గా చూడటం లక్ష్యం అని ఆరతి చెప్పింది. మరోపక్క, తన కొడుకు చనిపోయాడన్న బాధలో ఆర్మీపై తాత ఆగ్రహం వ్యక్తం చేయగా 'నాకు అవకాశం ఇస్తే ఆర్మీలో కూడా జాయిన్ అవుతాను. నా తండ్రిని చూసి గర్వపడతాను. ఎందుకంటే ఆయన చనిపోలేదు. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. ఎలాగైనా ఢిల్లీలోని ఐఐటీలో చేరాలని ఉంది.. కానీ ఇప్పుడు నెరవేరుతుందో లేదో నాకు తెలియదు' అంటూ ఆరతి కాస్తంత బాధతో చెప్పింది. ఇలాంటి కుటుంబాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలుగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ బాధ్యత తీసుకుంటే బావుంటుంది.