ఆస్పత్రిలో హైడ్రామా!
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ఆదివారం హైడ్రామా నడిచింది. వివరాల్లోకి వెళితే... డి.చెర్లోపల్లికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గంగానాయుడు, మరో వ్యక్తి రాధాకృష్ణలు శనివారం బత్తలపల్లిలోని ఎస్బీఐ మెసెంజర్ ఆదిశేషయ్యతో గొడవపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఆదిశేషయ్య అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఆ తర్వాత అనంతపురం వచ్చి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఆస్పత్రికి వచ్చి, తనను తీసుకెళ్లడానికి ప్రయత్నించారని బాధితుడు తెలిపారు. అయితే తాను రానని మొండికేయడంతో వెనుదిరిగిపోయారన్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్ల వలన తానిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయకుండా, తనపైనే కేసు నమోదు చేయడానికి కుట్ర చేస్తున్నారని బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు.