
విమానశ్రయాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన నిరోధించడం కోసం నో-ఫ్లై లిస్టు అంటూ ఎన్ని చర్యలు తీసుకొచ్చినా ఘటనలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎయిరిండియా స్టాఫ్పై ఓ మహిళ ప్రయాణికురాలు తన ప్రతాపం చూపించింది. టిక్కెట్ జారీ విషయంలో ఎయిరిండియా ఉద్యోగిని ఆ మహిళా ప్రయాణికురాలు కొట్టింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రయాణికురాలు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
గతంలో శివసేన ఎంపీ రవింద్ర గైక్వాడ్ కూడా ఎయిరిండియా స్టాఫర్తో అమర్యాదగా ప్రవర్తించారు. డ్యూటీ మేనేజర్పై చెప్పుతో దాడికి దిగి 25 సార్లు కొట్టారు. అనంతరం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పౌర విమానయాన శాఖ 'నో ఫ్లై' జాబితాను విడుదల చేసింది. దీని కింద దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై మూడు నెలల నుంచి జీవిత కాలం పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించనున్నట్టు పేర్కొంది.