మీసేవ ద్వారా సబ్సిడీ విత్తనాలు | By meeseva subsidy seeds | Sakshi
Sakshi News home page

మీసేవ ద్వారా సబ్సిడీ విత్తనాలు

Sep 12 2013 2:11 AM | Updated on Oct 9 2018 6:34 PM

మీసేవ ద్వారా రబీ సీజన్‌కు సంబంధించి అన్ని రకాల విత్తనాలను రైతులకు అందించనున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన్ రావు వెల్లడించారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్:  మీసేవ ద్వారా రబీ సీజన్‌కు సంబంధించి అన్ని రకాల విత్తనాలను రైతులకు అందించనున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదన్ రావు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ విధానంలో రైతులు పాస్‌బుక్ లు తీసుకెళ్లి మీసేవ కౌంటర్‌లో విత్తనాలకు సంబంధించి పూర్తి డబ్బులు చెల్లించి, అక్కడ ఇచ్చే రశీదులు తీసుకొచ్చి వ్యవసాయాధికారులకు ఇస్తే విత్తనాలకు అందిస్తారన్నారు.
 
 అయితే ఇదివరకు ఉన్న తరహాలో కాకుండా రైతులు ముందుగా విత్తనాలకు సంబంధించిన పూర్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంద ని, ఆ తర్వాత సబ్సిడీని మూడు రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ఆయన వివరించారు. ఈ రబీ సీజన్‌లో వేరుశనగ, శనగ విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వీటిని మీసేవ ద్వారా రైతులు పొందే సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానం వల్ల అక్రమాలను అరికట్టడంతో పాటు నేరుగా రైతులు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందన్నారు. మీసేవ ద్వారా పంపిణీపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  మరో నెలరోజుల్లో వరి విత్తనాలు వస్తాయని, వాటిని మీసేవ ద్వారానే అందిస్తామని ఆయన తెలిపారు. అనంతరం రబీకి సంబంధించిన ప్రణాళికలు వివరించాల్సిందిగా అధికారులను కోరారు. జేడీఏ కేవీ రామరాజు మాట్లాడుతూ...  ఖరీఫ్‌లో ముందస్తు ప్రణాళికలతో 105 శాతాన్ని చేరుకున్నామని వివరించారు. ప్రస్తుతం సీజన్ అధికంగానే ఉన్నా, రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. యూరియా 79 వేల మెట్రిక్ టన్నుల కోటా వచ్చిందని, అదేవిధంగా వేరుశనగ 77 వేల మెట్రిక్ టన్నుల కోటా వచ్చిందన్నారు. ఖరీఫ్ తరహాలోనే రబీ సీజన్‌ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీడీ జయచంద్ర, ఏడీ రఘురాములు, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement