కలెక్టరేట్‌కు మళ్లీ కరెంట్ కట్ | again current shock to karimnagar collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌కు మళ్లీ కరెంట్ కట్

Dec 24 2013 2:59 AM | Updated on Sep 2 2017 1:53 AM

జిల్లా పరిపాలన కేంద్రం కలెక్టరేట్‌కు మళ్లీ కరెంటు తిప్పలు వచ్చిపడ్డాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు కటింగ్ మంత్రం ఉపయోగించారు

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
 జిల్లా పరిపాలన కేంద్రం కలెక్టరేట్‌కు మళ్లీ కరెంటు తిప్పలు వచ్చిపడ్డాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు కటింగ్ మంత్రం ఉపయోగించారు. కలెక్టరేట్‌లోని 42 ప్రభుత్వ శాఖలన్నీ కలిపి రూ.3 కోట్ల 78 లక్షల 94 వేలు బిల్లు బకాయి పడ్డాయి. ఏళ్లకేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ట్రాన్స్‌కో విజ్ఞప్తి చేసినా ఆయా శాఖలు పట్టించుకోలేదు. వసూళ్లపై దృష్టి సారించిన ట్రాన్స్‌కో ఆయా శాఖలపై కన్నెర్ర చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం వరకు ఐదు ప్రభుత్వ శాఖల్లో అధికారులు కరెంట్ కట్ చేశారు. గతంలో మూడుసార్లు కరెంట్ కట్ చేసి బకాయిలపై హెచ్చరించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడి సముదాయించడంతో శాంతించిన అధికారులు ఈ ఒక్కసారికేనంటూ సరఫరా పునరుద్ధరించారు.
 
 ఆనక బిల్లుల చెల్లింపు ఊసే మరిచిపోవడంతో ట్రాన్స్‌కో కలెక్టరేట్‌లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆదివారం వ్యవసాయశాఖ, విద్యాశాఖ కార్యాలయాల్లో కరెంటు తొలగించగా.. సోమవారం ఉదయం నుంచి సిబ్బందికి తిప్పలు తప్పలేదు. చీకట్లోనే విధులు కొనసాగించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సీపీవో, జిల్లా పంచాయతీశాఖ, పశుసంవర్ధకశాఖలో కరెంటు తొలగించారు. ఇక ఉపేక్షించేది లేదని, బిల్లు కడితేనే కరెంటు సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తోంది. మంగళవారం కలెక్టరేట్‌లోని 42 ప్రభుత్వశాఖల్లో కరెంట్ కట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
 
 బకాయిల్లో కొన్ని..
 శాఖ                         బకాయి (రూ.లక్షల్లో)
 సీపీవో                      రూ.11.80
 డీపీవో                   రూ.4.44
 పశుసంర్ధకశాఖ జేడీ    రూ.13.24
 డీఈవో                          రూ.26.22
 వ్యవసాయశాఖ               రూ.25.84

Advertisement
 
Advertisement
Advertisement