– శ్రీవారి దర్శనానికి 30 గంటలు
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోవడంతో భక్తులు గోగర్భం వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 92,830 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 48,987 మంది తలనీలాలు అర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.60 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 30 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
పకడ్బందీగా ఏర్పాట్లు: అశేష భక్తజనులకు తిరుమలలో టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఎవరూ ఇబ్బంది పడకుండా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. క్యూల్లోని వారి కోసం ప్రత్యేకంగా 20 పాయింట్లలో ఆహారం అందిస్తోంది. అలాగే 37 పాయింట్లను ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేస్తోంది. ఈ క్రమంలోనే, పారిశుద్ధ్య నిర్వహణను సైతం నిరంతరం పర్యవేక్షిస్తోంది.


