
తొలి భారతీయ మిల్లెట్ బ్రాండ్ ‘ఈట్రైట్’
రెడీ టు ఈట్ చిరుధాన్య ఆహారోత్పత్తులు
500కు పైగా స్టార్టప్లకు మార్గదర్శనం
తెలుగువాళ్లు ఏర్పాటు చేసినవే 200
సాక్షితో ఐసీఏఆర్–ఐఐఎంఆర్ సీఈవో డాక్టర్ బి.దయాకర్రావు
చిరుధాన్యాలు.. మరుగున పడిపోయిన పోషక ధాన్యాలు. కానీ జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ‘భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఎంఆర్)’చిరుధాన్యాలను తిరిగి ప్రజల ఆహారంలోకి చేర్చేందుకు కృషి చేస్తోంది. ఆధునికులు ఇష్టపడే రెడీ టు ఈట్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటానికి 9 ఏళ్ల క్రితం ‘న్యూట్రిహబ్’పేరిట టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ను నెలకొల్పింది.
చిరుధాన్యాలతో చిరుతిళ్లు, అల్పాహార ఉత్పత్తులను తయారు చేసి, విక్రయించటంలో 500కు పైగా స్టార్టప్లకు న్యూట్రిహబ్ మార్గదర్శనం చేసింది. న్యూట్రిహబ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.దయాకర్రావు విశేష కృషి చేస్తూ చిరుధాన్యాలతో 110 రకాల ఆధునిక ఆహారోత్పత్తులను తయారు చేసే సాంకేతికతలను ప్రామాణీకరించారు. ‘ఈట్రైట్’పేరిట తొలి భారతీయ చిరుధాన్య ఉత్పత్తుల బ్రాండ్ను నెలకొల్పారు. ఈ నేపథ్యంలో డా.దయాకర్రావుతో ముఖాముఖి. – సాక్షి, సాగుబడి
ప్రశ్న: ‘న్యూట్రిహబ్’సీఈవోగా మీ ఆధ్వర్యంలో చిరుధాన్యాలను ఆహార మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు బహుముఖ కృషి జరిగింది. ఏకంగా 110 రకాల చిరుధాన్యాల ఆధునిక ఆహారోత్పత్తుల తయారీ సాంకేతికతలను ప్రామాణీకరించటం ప్రపంచంలోనే ఒక అపూర్వమైన విషయం. ఇది ఎలా సాధ్యమైంది?
జవాబు: మిల్లెట్స్ సాగు విస్తీర్ణం, వినియోగం పెరగాలంటే మార్కెట్ సృష్టించాలి. చిరుధాన్యాల్లో పోషకాలు, విలువ జోడింపు, శుద్ధి, యంత్రాల అభివృద్ధి, బ్రాండింగ్, ప్రాచుర్యం కల్పించటం, విధాన నిర్ణేతలకు మౌలిక నివేదికలు అందించటం వంటి విషయాల్లో సమగ్ర దృష్టితో చేసిన కృషి ఫలించటం వల్లనే స్టార్టప్లు, ఆహార కంపెనీలు సైతం చిరుధాన్యాల ఉత్పత్తులను పెద్దఎత్తున మార్కెట్లోకి తేగలిగాయి.
ప్ర: తొలి భారతీయ మిల్లెట్ బ్రాండ్ ‘ఈట్రైట్’గురించి చెబుతారా?
జ: 2010లో ప్రపంచబ్యాంకు ప్రాజెక్టులో భాగంగా ఐఐఎంఆర్ సొంత బ్రాండ్ ‘ఈట్రైట్’ను ప్రారంభించి, ప్రజలకు చిరుధాన్య ఆధునిక ఆహారాలను అందుబాటులోకి తెచ్చాం. రైతులు పశుగ్రాసం కోసమే చిరుధాన్యాలు సాగు చేసే పరిస్థితుల్లో చిరుధాన్యాలకు విలువ జోడించి ఉత్పత్తులు తయారు చేసే వ్యాల్యూ చెయిన్ను రూపొందించేందుకు కృషి చేశాం. ఐటీసీతో కలసి రైతుల నుంచి చిరుధాన్యాలు కొనుగోలు చేయించి, ప్రాసెసర్లకు సరఫరా చేయించాం. మిల్లెట్ సైన్స్ ను బిల్డ్ చేసే క్రమంలో ఎన్ఐఎన్తో కలసి షుగర్పై క్లినికల్ ట్రయల్స్ చేశాం.
ప్ర: జాతీయ, అంతర్జాతీయంగా ప్రజలకు వందలాది ఆధునిక చిరుధాన్య ఆహారోత్పత్తులను పరిచయం చేసిన తొలి శాస్త్రవేత్తగా మీ అనుభవాలేమిటి?
జ: ఉత్తరాదిలో చిరుధాన్యాలంటే సజ్జలు మాత్రమే. మిగతా చిరుధాన్యాలను, వాటిలో పోషకాలను వారికి అవగాహన కల్పించి 500 వరకు వంటకాలను పరిచయం చేశాం. అంతర్జాతీయంగా 250 మిల్లెట్ రెసిపీలను అందించాం. జీ–20 సభల కాలంలో 150 దేశాల ఎంబసీలకు ఈ రెసిపీలను అందించాం. అమెరికన్ కాన్సులేట్ వాళ్లు ఈ రెసిపీ బుక్స్ను తిరిగి పబ్లిష్ చేసి పంపిణీ చేశారు. దుబాయ్, జర్మన్ ఎక్స్పోలలో ప్రమోషన్ చేశాం. భవిష్యత్తులో చిరుధాన్యాల ఆహార పరిశ్రమ భేషుగ్గా ఉంటుంది. ఆన్లైన్ అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.
ప్ర: ఏయే టెక్నాలజీలకు ఆదరణ ఎక్కువగా ఉంది?
జ: రెడీ టు ఈట్ మిల్లెట్ ఉత్పత్తులు తయారు చేసే టెక్నాలజీలకు ఆదరణ బాగుంది. వాటిలో కొన్ని: న్యూట్రిబార్, చీజ్ బాల్స్, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ (ఫ్లేక్స్, మిస్లీ), మఫిన్స్, కుకీస్, బ్రెడ్, వర్మిసెల్లి, పాస్తా, వరి బియ్యంలా కనిపించే చిరుధాన్యాల అనలాగ్ బియ్యం, మిల్లెట్ మిల్క్ (నాన్ డెయిరీ మిల్్క).
ప్ర: ఈ టెక్నాలజీలలో మీకు అత్యంత కష్టం అనిపించిన, సంతృప్తినిచ్చినవి ఏవి?
జ: ఉదయపు అల్పాహారంలోకి వాడే మిల్లెట్ ఫ్లేక్స్, నూడుల్స్, బ్రెడ్, మిల్లెట్ (ప్లాంట్ బేస్డ్) మిల్క్ వంటి సాంకేతికతలను అభివృద్ధి చేయటానికి అదనంగా కష్టపడ్డాం. చిరుధాన్యాలతో గ్లుటెన్ ఫ్రీగా మిల్లెట్ ప్రొడక్ట్స్ చెయ్యాలంటే బంక కోసం మైదాకు బదులు ఏమి వాడాలి.. దాని రుచి, రూపం ఎలా ఉండాలి అని పరిశోధించాం. కర్రపెండలం వాడాం. ప్లాంట్ బేస్డ్ మిల్క్ తయారు చేశాం. కర్డ్, పన్నీర్పై పనిచెయ్యాల్సి ఉంది. ‘కంపోజిట్ ఫుడ్స్’తయారీపై పరిశోధన చేస్తున్నాం.
ఉదాహరణకు.. విటమిన్ డితో కూడిన మిల్లెట్ ఉత్పత్తుల కోసం మష్రూమ్స్ కలుపుతున్నాం. మిల్లెట్ ఫిష్ సాసేజ్లు తయారు చేశాం. ఇప్పటివరకు 110 టెక్నాలజీలను ప్రామాణీకరించి, వాటిని వాణిజ్యపరంగా వినియోగించుకొని ఉత్పత్తులు తయారు చేయటానికి 500 స్టార్టప్లకు, 200కుపైగా పెద్ద ఆహార కంపెనీలకు లైసెన్స్లు ఇచ్చాం. ఫ్లేకింగ్ ప్రాసెస్, పెద్ద రోటి మిషన్, చిన్న రోటి మిషన్.. ఈ మూడు టెక్నాలజీలకు పేటెంట్లు వచ్చాయి.
ప్ర: మీ ఆధ్వర్యంలో 500కు పైగా స్టార్టప్లకు న్యూట్రిహబ్ ఇంక్యుబేషన్ సేవలు అందించింది. వీటిలో ఎన్నిటికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు అందింది? వాటిలో ఎన్ని విజయం సాధించాయి? అందుకు కారణాలేమిటి?
జ: చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు, అల్పాహార ఉత్పత్తులను తయారు చేసి, విక్రయించటంలో 500కు పైగా స్టార్టప్లకు న్యూట్రిహబ్ మార్గదర్శనం చేసింది. మొత్తంగా రూ.1,000 కోట్ల వరకు ఈ స్టార్టప్లు పెట్టుబడి పెట్టాయి. అర్హులైన 110 స్టార్టప్లకు ఆర్కేవీవై రఫ్తార్ పథకం కింద రూ.10.5 కోట్ల నిధులను సమకూర్చాం. 200కు పైగా ప్రముఖ కంపెనీలు కూడా న్యూట్రిహబ్ నుంచి టెక్నాలజీలను తీసుకున్నాయి.
సాధారణంగా ఏ రంగంలోనైనా 90% స్టార్టప్లు లాభాల్లోకి రాకముందే మూలనపడతాయి. కానీ మిల్లెట్ స్టార్టప్లు 40–50% వరకు దేశవ్యాప్తంగా వ్యాపారం చేస్తూ చక్కగా పనిచేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో రెడీ టు ఈట్/ రెడీ టు కుక్ జంక్ ఫుడ్స్కు ఉన్న మార్కెట్లో 2–5 శాతం వరకు మిల్లెట్ స్టార్టప్స్ చేజిక్కించుకోగలిగాయి. ఈ ఉత్పత్తులన్నీ అతి తక్కువ ప్రాసెసింగ్తో చేసినవి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివి.
బాగా నడుస్తున్న స్టార్టప్లలో కొన్ని: ట్రూగుడ్, స్లర్ప్ ఫామ్స్, మిల్లెట్ అమ్మ, మిల్లెట్ మార్వెల్స్, మెబ్బిల్స్, దేశీ న్యూట్రి, బ్లిస్ ట్రీ, నౌరిష్ యు, మిల్లెట్ బ్యాంక్.

ఆయన మార్గదర్శకత్వంలో...
వ్యవసాయ ఆర్థికవేత్తగా 32 ఏళ్ల సర్వీసులో జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పలు వైవిధ్యభరితమైన చిరుధాన్య ఆహార సాంకేతికతలను అందించిన శాస్త్రవేత్త డా.దయాకర్రావు. 200కు పైగా పెద్ద ఆహార పరిశ్రమలకు మిల్లెట్ ఫుడ్ టెక్నాలజీలను అందించటం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో అనుసంధానం చేయటం ద్వారా మిల్లెట్ వాల్యూ చెయిన్ను అభివృద్ధి చేయటంలో ఆయన కీలకపాత్ర నిర్వహించారు. దయాకర్రావు మార్గదర్శకత్వంలో చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు, అల్పాహార ఉత్పత్తులను తయారు చేసి, విక్రయించటంలో 500కు పైగా స్టార్టప్లకు న్యూట్రిహబ్ మార్గదర్శనం చేసింది.
ప్ర: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మిల్లెట్ స్టార్టప్లు వచ్చాయి? విజయపథంలో పయనిస్తున్న స్టార్టప్లు ఎన్ని? వాటికి కలిసొచి్చన అంశాలేమిటి?
జ: స్టార్టప్లలో మనవాళ్లవే ఎక్కువ. 200 వరకు ఉంటాయి. ఇందులో సక్సెస్ఫుల్గా నడుస్తున్నవి 50 వరకు ఉంటాయి. ఐఐఎంఆర్ హైదరాబాద్లో ఉండటం, ప్రభుత్వాల ప్రోత్సాహం, ప్రజల్లో షుగర్ సమస్య పెరగడంతో ఆహార చైతన్యం ఎక్కువగా ఉండటం, స్టార్టప్ నిర్వాహకుల్లో ప్యాషన్ వంటివి కలిసొచ్చాయి.