వారికి సీపీ సజ్జనార్‌ సన్మానం.. ప్రశంసా పత్రాలు | CP Sajjanar Felicitates Citizens Who Became Public Police | Sakshi
Sakshi News home page

వారికి సీపీ సజ్జనార్‌ సన్మానం.. ప్రశంసా పత్రాలు

Apr 17 2026 7:13 PM | Updated on Apr 17 2026 7:51 PM

CP Sajjanar Felicitates Citizens Who Became Public Police
  • ప్రతి ఒక్కరూ ప్రజా పోలీస్‌గా మారాలని పిలుపు

హైదరాబాద్‌:  తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిని సాహసోపేతంగా అడ్డుకుని, పోలీసులకు అప్పగించిన ముగ్గురు పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సెజల్, గణపతి, కాశీనాథ్‌లను ఆయన ఘనంగా సన్మానించి.. వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డును అందజేశారు.

ఈ సందర్భంగా నగర సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. సమయస్ఫూర్తితో, సామాజిక బాధ్యతతో వ్యవహరించిన ఈ యువతను కొనియాడారు. వీరి సాహసం సమాజానికి ఒక గొప్ప సందేశమని, మహిళలు, చిన్నారుల రక్షణలో పౌరులు ఇలాగే అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చు అని ఆయన అన్నారు.

నేరాల నియంత్రణలో పోలీసులు ఎంత కృషి చేసినా, పౌర చైతన్యం తోడైనప్పుడే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రజా పోలీస్‌గా మారాలని పిలుపునిచ్చారు. ఇటీవల గోల్కొండ ప్రాంతంలో మహమ్మద్ ఫిరోజ్ అనే వ్యక్తి ఇలాగే ఎనిమిదేళ్ల బాలికను రక్షించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సమాజంలో ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగినప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 100 కి ఫోన్ కాల్ గానీ, హైదరాబాద్ పొలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555 కి సమాచారం అందించి, బాధ్యతాయుతమైన పౌరులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, జూబ్లీహిల్స్ ఎస్సై సోమ శేఖర్, తదితరులు పాల్గొన్నారు. 

అసలేం జరిగిందంటే..
ఈ నెల 14న సెజల్ తన స్నేహితుడు గణపతితో కలిసి యూసుఫ్‌గూడ నుండి మాదాపూర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 సమీపంలో ఒక వ్యక్తి చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గమనించారు. 

ఆ చిన్నారి కళ్లలో భయాన్ని చూసి చలించిపోయిన వారు, తక్షణమే స్పందించి అటుగా వెళ్తున్న కాశీనాథ్, శ్రీ నారాయణల సాయంతో నిందితుడిని అడ్డుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డయల్ 100కు సమాచారం అందించి నిందితుడిని పోలీసులకు పట్టించారు.

పోలీసుల విచారణలో  నిందితుడు యూసఫ్ గూడకు చెందిన జావీద్ అనే వ్యక్తిగా తేలింది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో, ఆ చిన్నారికి ఐస్‌క్రీమ్ కొనిస్తానని మభ్యపెట్టి తన బైక్‌పై తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement