ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్(21), గైక్వాడ్(22) రాణించారు. ఈ ఏడాది సీజన్లో సంజూకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్, అశ్విని కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.
అకిల్ మ్యాజిక్
అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. ముంబై ఇండియన్స్కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.


