ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కే సింగం సంజూ శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సంజూ జూలు విదిల్చి సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సంజూతో పాటు బౌలింగ్లో జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) సత్తా చాటడంతో ఢిల్లీపై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో అద్భుత శతకంతో చెలరేగిన సంజూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించాడు. ఇందులో ఓ భారీ సిక్సర్ల రికార్డు సైతం ఉంది. అదేంటంటే.. ఈ మ్యాచ్లో 4 సిక్సర్లు బాదిన అనంతరం టీ20ల్లో సంజూ సిక్సర్ల సంఖ్య క్వాడ్రపుల్ సెంచరీకి (400) చేరింది.
పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అరుదైన మైలురాయి. ఇప్పటివరకు ఈ మైలురాయిని కేవలం 29 మంది మాత్రమే (సంజూతో కలుపుకొని) తాకారు. భారత్ తరఫున సంజూకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు.
వీరిలో రోహిత్ శర్మ (554), విరాట్ కోహ్లి (440), సూర్యకుమార్ యాదవ్ (421) వంటి సిక్స్ హిట్టింగ్ మిషన్లు ఉన్నారు. ఇప్పుడు సంజూ బాబా వీరి సరసన చేరాడు. ఓవరాల్గా పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ (1056) చలామణి అవుతున్నాడు. అతనికి చాలా దూరంలో కీరన్ పోలార్డ్ (982), ఆండ్రీ రసెల్ (784) తదితర విండీస్ యోధులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లి 21, సూర్యకుమార్ యాదవ్ 23, సంజూ శాంసన్ 29 స్థానాల్లో ఉన్నారు.


