పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజహర్ అలీ స్కాట్లాండ్ క్రికెట్ జట్టుతో చేతులు కలిపాడు. త్వరలో నేపాల్లో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లీగ్-2 టోర్నీ కోసం ఆ జట్టు బ్యాక్రూమ్ స్టాఫ్ కన్సల్టెంట్గా చేరాడు. ఈ టోర్నీలో స్కాట్లాండ్ , నేపాల్తో పాటు అమెరికా పాల్గొంటుంది. 2010-22 మధ్యలో పాక్ తరఫున కీలక బ్యాటర్గా వ్యవహరించిన 41 ఏళ్ల అలీ.. రిటైర్మెంట్ అనంతరం పాక్ జాతీయ జట్టు సెలెక్టర్గా కూడా పని చేశాడు.
కెరీర్లో 97 టెస్టులు, 53 వన్డేలు ఆడిన అలీ.. దాదాపు 9000 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ సహా 21 సెంచరీలు, 47 అర్ద సెంచరీలు ఉన్నాయి. అలీ ప్రస్తుత పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. 2016లో వెస్టిండీస్పై బాబర్ వరుసగా మూడు వన్డే సెంచరీలు సాధించిన సమయంలో అలీ జట్టు పాక్ కెప్టెన్గా ఉన్నాడు. అలాగే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్ జట్టులో ఈ ఇద్దరూ కీలక సభ్యులు.
క్రికెట్ వరల్డ్కప్ లీగ్-2 విషయానికొస్తే.. ఈ టోర్నీ మే 12న ప్రారంభం కానుంది. ఆ రోజు స్కాట్లాండ్ నేపాల్తో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం మే 14న అమెరికాతో తలపడనుంది. తిరిగి మే 18, 20 తేదీల్లో మరోసారి ఈ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి.


