● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సొంత నిధులతో పర్యటన ఏర్పాట్లు
విజయనగరం రూరల్: ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు కేరళ పర్యటనకు శనివారం బయలుదేరి వెళ్లారు. నిరంతరం ప్రజా సేవలో, ప్రజల మధ్యనే ఉంటూ, గత ఐదేళ్లుగా జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీటీసీ సభ్యులందరికీ ప్రత్యేక గుర్తింపుగా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు తన సొంత ఖర్చులతో ఐదు రోజుల కేరళ పర్యటనకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి జెడ్పీ చైర్మన్తో పాటు సభ్యులు ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు వి.నరసింహమూర్తి, జెడ్పీటీసీ ప్రతినిధి వల్లి రెడ్డి శ్రీను జన్మదిన వేడుకలను హైదరాబాద్ విమానాశ్రయంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో అందరూ కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా జరిపారు.
పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు
సీతానగరం: మండలంలోని చినబోగిలి పొలిమేరల్లో పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ హేమలత తెలిపారు. వీరి నుంచి రూ.3,130లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. డ్రోన్ కెమెరా సాయంతో పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని గుర్తించి సిబ్బందితో వెళ్లి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
సిరిపురంలో వీధికుక్కల స్వైర విహారం
రాజాం/సంతకవిటి : సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం అధికమైంది. కుక్కల బాధ తాళలేక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆరునెలలు క్రితం ఈ వీధి కుక్కల స్వైర విహారంతో పలువురు గ్రామస్తులు గాయాల పాలయ్యారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో వీధి కుక్కలు కళ్లాల్లోని మూగజీవాలపై విరుచుకుపడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఈ కుక్కల దాడిలో గ్రామానికి చెందిన పలువురు రైతులకు సంబంధించి 12 లేగ దూడలు మృతి చెందాయి. అప్పుడే పుట్టిన దూడలు, రెండు మూడు వారాలు వ్యవధి ఉన్న లేగదూడలపై దాడి చేసి హతమార్చుతున్నాయి. కళ్లాల్లో పశువుల శాలల్లో కడుతున్న దూడలపై దాడి చేసి గాయపర్చడం, ఒక్కోదపా పొలాల్లోకి లాక్కెళ్లి తినేయడం చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కల అధికమయ్యాయని, ఇతర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సంచరించడమే కాకుండా రాత్రిళ్లు పెద్దపెద్ద అరుపులతో ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తున్నాయని గ్రామస్తులు వెల్లడించారు. వీటిని అదుపు చేయాలని, యాంటీ బర్త్ ఇంజక్షన్లు చేయాలని పంచాయతీ సచివాలయలంలో ఫిర్యాదు చేసామని, ఇంతవరకూ ఏ ఒక్కరూ పట్టించుకోలేదని గ్రామానికి చెందిన రైతు రాంబాబు వెల్లడించారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
● వారం రోజుల వ్యవధిలో 12
లేగదూడలు మృతి
● ఫిర్యాదు చేసినా పట్టించుకోని
పంచాయతీ శాఖ


