
ఇరకాటం... పితలాటకం
నరసరావుపేట: గత రెండు నెలల నుంచి జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నూతన ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు బ్రేక్ పడింది. అంతకు ముందు తీసుకొన్న వారే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అతి ముఖ్యమైన ప్లాన్ మంజూరులో స్వీయ సర్టిఫికేషన్ స్కీం(ఎన్సీఎస్)ను ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. మున్సిపల్ లైసెన్స్డ్ ఇంజనీర్లుగా పిలవబడే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్(ఎల్టీపీ)లపై నూతన మార్గదర్శకాలు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం రెండు నెలల కిందట జీవో నంబర్– 20 తెచ్చింది. ఆ నిబంధనల మేరకు ఎల్టీపీలు అప్లోడు చేయకపోవడంతో ప్లాన్లు అధికారుల ముందుకురాలేదు. గతంలో మున్సిపల్ అధికారులే ప్లాన్ అప్రూవల్ చేసేవారు. ఇందులో అధికారులు లంచాలు గుంజటం, ఇవ్వని వారి ప్లాన్లకు ఏదో ఒక కారణం చూపి ఆపేస్తూ జాప్యానికి కారణమవుతున్నారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది.
ఎల్టీపీల చేతిలో అప్రూవల్
ప్లాన్ అప్రూవల్ అధికారం మున్సిపల్ అధికారుల నుంచి తప్పించి ఎల్టీపీల చేతిలో పెట్టింది. ప్లాన్ గీసిన వారికే మున్సిపల్ నిబంధనల ప్రకారం అప్రూవల్ చేసే అధికారం ఇచ్చింది. దీనిలో ఎటువంటి అవకతవకలు జరిగినా యజమాని, ఎల్టీపీలనే బాధ్యులుగా నిర్ణయించింది. తీసుకున్న ప్లాన్ ప్రకారం నిర్మిస్తామని యజమాని, ఎల్టీపీలు స్వీయ సర్టిఫికెట్ అందజేయాలనే నిబంధనలు పెట్టింది. భవన నిర్మాణదారులు తీసుకున్న ప్లాన్కు వ్యతిరేకంగా నిర్మాణం చేస్తే , దాన్ని నిలిపివేసే అధికారం ఎల్టీపీలకే కట్టబెట్టడంతో పాటు జరిమానా విధించే అధికారం కూడా వారికే ఇవ్వడం గమనార్హం. ఎల్టీపీలు పొరపాట్లు చేస్తే వారి లైసెన్స్ను ఐదేళ్లపాటు రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిన గత్యంతరం దాపురించింది. పురపాలక పరిధిలో లైసెన్స్ తీసుకున్న సుమారు 30మంది ఎల్టీపీలు ఎస్సీఎస్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి ప్లాన్ మంజూరైన తర్వాత యజమాని తమ నియంత్రణలో ఉండరని, వారిని నియంత్రించే శక్తి, నిర్మిస్తున్న భవనాన్ని ఆపే సిబ్బంది తమకు ఉండరని ఎల్టీపీలు వాదిస్తున్నారు. దీంతో వారంతా కిమ్మనకుండా కూర్చున్నారు. నూతన నియమాల మేరకు ఎల్టీపీల లైసెన్స్ల మంజూరుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారెవరూ సహకరించకపోవడంతో ప్లాన్లు ఆన్లైన్లో ప్రభుత్వానికి చేరడంలేదు. ఈ కారణంగా ఇంటి నిర్మాణాలు ఆగిపోవటంతో యజమానులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
జీవో నంబర్– 20తో కుదేలైననూతన గృహ నిర్మాణ రంగం జీవోపై రుసరుసలాడుతున్న యజమానులు, ఎల్టీపీలు ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు సహకరించని ఎల్టీపీలు
ఒక ప్లాన్ మాత్రమే వచ్చింది
జీవో 20 వచ్చిన తర్వాత పురపాలక పరిధిలో ఒక ప్లాన్ మాత్రమే వచ్చింది. ఎల్టీపీలు నూతన మార్గదర్శకాల మేరకు లైసెన్స్ అప్రూవల్ చేసుకోవాలని పిలిచాం. వారి నుంచి స్పందన కూడా లేదు.
–కె.సాంబయ్య, టీపీవో

ఇరకాటం... పితలాటకం