హాజరులో తిరకాసు
ఏపీఎంతో విచారణ చేయిస్తాం
క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండా పని బాగోలేదన్న ఫీల్డ్ అసిస్టెంట్
పెడన: ఉపాధి కూలీలకు పనులు కల్పించి ఏ రోజు కూలి డబ్బులు ఆ రోజే ఇచ్చేస్తున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు పాలనలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మండలంలోని నందిగామలో జరుగుతున్న ఉపాధి పనులే ఇందుకు నిదర్శనం. వారం రోజులు పనులకు వెళ్లినా రూ.1000 కూడా కూలి రావడంలేదని కూలీలు వాపోతున్నారు. ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.270 నుంచి రూ.320 నగదు వచ్చేలా పనులు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయడం లేదనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు పనులు చేసిన చోట హాజరు నమోదవక ఎక్కడో దూరంగా వెళ్లి ఆన్లైన్ చేస్తుండటాన్ని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు అవకా శంగా తీసుకుని కూలీలను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
పనిచేసిన రోజు హాజరు తీసుకోని ఎఫ్ఏ
మండలవలోని నందిగామ దళితవాడకు చెందిన ఉపాధి కూలీలు 50 మందికిపైగా శుక్రవారం పనికి వెళ్లారు. వారికి మేట్లు సుధాకర్, ప్రకాష్ పని కల్పించారు. ఆ పనిని పూర్తి చేసిన శ్రామికుల హాజరు తీసుకోవాల్సి ఫీల్డ్ అసిస్టెంట్ పోలగాని అమలేశ్వరరావు పని ప్రదేశానికి రాలేదు. సిగ్నల్ అందే చోటకు రావాలని చెప్పడంతో అంత ఎండలో రాలేమని, పనిచేసే చోట సిగ్నల్ అందుతోందని మేట్లు కూడా చెబుతున్నారని కూలీలు చెప్పినా వినిపించుకోకుండా చేసిన పని బాగోలేదని పేర్కొంటూ కూలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు శనివారం కూలీలకు పనులు కల్పించకుండా ఖాళీగా కూర్చో బెట్టారు.
నందిగామ దళితవాడ వద్ద పనులు జరిగిన చోటుకు ఎఫ్ఏ వెళ్లకుండా పని బాగోలేదనే విషయంతో పాటు ఉపాధి కూలీల అటెండెన్సు చేసిన పని రోజున వేయకపోవడం, మరుసటి రోజున పనులు కల్పించకపోవడం వంటి విషయాలపై ఏపీఎంను పంపించి విచారణ చేయిస్తాం. గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసుకుంటా. ఉపాధి కూలీలకు న్యాయం చేస్తాం.
– ఎ.అరుణకుమారి, ఎంపీడీఓ, పెడన
హాజరు కోసం సిగ్నల్స్ అందడం లేదనే సాకుతో తమను ఫీల్డ్ అసిస్టెంట్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూలీలు దుయ్యబడుతున్నారు. శుక్రవారం పని చేయగా హాజరు వేయకుండా పనిచేయని రోజు హాజరు తీసుకునేందుకు ఎఫ్ఏ ప్రయత్నించడంపై కూలీలు మండిపడ్డారు. ఏ రోజు పనులకు ఆ రోజు కూలి ఇవ్వకుండా, మరుసటి రోజు పని కల్పించకుండా ఖాళీగా కూర్చోబెట్టడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీఓ వజీర్ దృష్టికి తీసుకువెళ్లగా.. పని బాగోలేదని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారని, తనకు రావడం కుదరదని, నందమూరులో ఉన్నానని బదులిచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డుకు వెళ్లకుండా పని బాగోలేదని ఫిర్యాదు చేస్తే ఏపీఎం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


