కంచికచర్ల: గుర్తు తెలియని దొంగలు ఓ ఇంటి కిచెన్ తలుపులు పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలతో పాటు నగదు దొంగిలించిన సంఘటన కంచికచర్ల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు మండలంలోని పరిటాల శివారు నక్కలంపేటలో గుత్తా పద్మజ, ఆమె తండ్రి కొమ్మినేని కృష్ణారావు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటి కిచెన్ డోర్ గడియను విరిచి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బెడ్రూంలోని కప్బోర్డులను, లాకర్లను తాళాలతో తెరిచి అందులో ఉన్న సుమారు 394 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదు అపహరించుకుపోయారన్నారు. ఇంటి యజమానురాలు పద్మజ తెల్లవారుజామున 3 గంటలకు మంచినీటి కోసం నిద్ర నుంచి లేవగా కిచెన్ డోర్ పగులకొట్టి ఉండడం, మెయిన్డోర్ కూడా తెరిచే ఉండడం గమనించారన్నారు. దీంతో కంగుతిన్న పద్మజ తన తండ్రి కృష్ణారావును లేపి బీరువా తెరిచి చూడగా బంగారు ఆభరణాలు నగదు పోయాయని గ్రహించారన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా రూరల్ సర్కిల్ సీఐ వైవీవీఎన్ నాయుడుతో కలసి గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులను పిలిపించామని తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన
రూరల్ డీసీపీ
కంచికచర్ల మండలంలో జరిగిన దొంగతనం గురించి సీఐ వైవీవీఎల్ నాయుడు విజయవాడ రూరల్ డీసీసీ బి.లక్ష్మీనారాయణకు సమాచారం అందించారు. డీసీపీ నందిగామ ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్తో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఇంటి యజమానురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తామని చెప్పారు.


