వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆగ్రహం చంద్రబాబు, పవన్ సంతకాలతో ఇచ్చిన బాండ్ల ప్రతులు దహనం ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకోవాలంటూ నినాదాలు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని క్లస్టర్–3 అజిత్సింగ్నగర్ పైపుల రోడ్డు జంక్షన్లో నిరసన కార్యక్రమం జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో క్లస్టర్ అధ్యక్షుడు పసుపులేటి ఏసు కండ్రిక వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి పైపుల రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల బాండ్లను దహ నం చేశారు. డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకు లు పాల్గొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పప్పులమిల్లు సెంటర్లో జరిగిన కార్యక్రమానికి పార్టీ స్థానిక నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎండీ రుహుల్లా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
మైలవరం నియోజకవర్గంలోని మైలవరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవరకొండ ఆంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి లక్కిరెడ్డి హనిమిరెడ్డి కాంప్లెక్స్ వరకు ర్యాలీని నిర్వహించారు. జి.కొండూరులో పార్టీ మండల అధ్యక్షుడు జడ రాంబాబు, ఇబ్రహీంపట్నంలో మండల అధ్యక్షుడు రెంటపల్లి నాగరాజు, రెడ్డిగూడెంలో పార్టీ మండల అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ రూరల్ మండలంలోని వైఎస్సార్ కాలనీలో పార్టీ మండల అధ్యక్షుడు బయ్యారపు రవికిశోర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ రింగ్ సెంటర్ నుంచి చనుమోలు ఫ్లై ఓవర్ వరకు ర్యాలీ చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నాగులూరి దుర్గా ప్రసాద్, జిల్లా మాజీ ఏఎంసీ చైర్మెన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి, వైస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ఉయ్యూరు పట్టణంలో గురువారం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో పట్టణంలో టీడీపీ మేనిపెస్టో, హామీ బాండ్లను నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంపాన కొండలరావు, ఉయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు దాచే రవి, పట్టణ అధ్యక్షులు అబుల్కలాం, ఎంపీపీ చీలి కల్పన పాల్గొన్నారు.
గన్నవరం నియోజకవర్గంలో ఇన్చార్జ్ వల్లభనేని వంశీమోహన్ ఆదేశాల మేరకు గన్నవరంలో జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజిబెత్రాణి, మహిళా నాయకులు టీడీపీ మేనిఫెస్టో, హామీ బాండ్లను దగ్ధం చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
నందిగామ పట్టణంలోని గాంధీ సెంటరులో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబుకు వెన్నుపోటు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్కల్యాణ్ సంతకాలతో కూడిన బాండ్లను దహనం చేశారు.
తిరువూరు నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు తిరువూరు బోస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గంపలగూడెం మండలంలో పార్టీ నాయకుడు ఆలపాటి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విస్నన్నపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, సిరసాని ప్రకాష్, ఓలేటి దుర్గారావు, నెక్కలపు కుటుంబరావు, పల్లెపాం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణీగారితోట, శిఖామణిసెంటర్, పటమ ట ఆల్ఫా సెంటర్ మూడు ప్రాంతాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మూడు చోట్ల పాల్గొని, ప్రభుత్వ అబద్ధపు హామీలు, మోసగించిన తీరును వివరించారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్సిక్స్ హామీల పత్రాలను దహనం చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చిబాబు, ఆళ్ల చల్లరావు, రాష్ట్రకార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, సోషియా మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దహనమవుతున్న బాండ్ల ప్రతులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇచ్చిన హామీలు మరిచి, రెండేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపుతున్న చంద్రబాబు సర్కారు పనితీరుపై ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ నగరంతో పాటు మండల కేంద్రాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. టీడీపీ సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ సంతకాలతో ఇచ్చిన బాండ్ల ప్రతులను వైఎస్సార్ సీపీ శ్రేణులు దహనం చేశాయి. కూటమి రెండేళ్ల పాలనంతా అధ్వానం, దగా మోసం, అవినీతి అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆయన ఇచ్చిన హామీలకు చంద్రగ్రహణం పట్టిందని నినదించారు.


