ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ పర్యటన రద్దయింది. రాజస్తాన్లోని బలోత్రా జిల్లా పచ్పద్రలోని చమురు శుద్ధి కర్మాగారంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మంగళవారం ఈ రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయాల్సి ఉంది.
కానీ అనూహ్య ప్రమాదం కారణంగా మోదీ రాజస్తాన్ పర్యటన రద్దు అయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకనట విడుదల చేసింది. మంగళవారం రిఫైనరీ ప్రారంభోత్సవంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. అగ్నిప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు సీఎం భజన్లాల్ శర్మ కార్యాలయం ధృవీకరించింది.
ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం సాయంత్రం పచ్పద్ర వెళ్లాల్సిన సీఎం పర్యటన కూడా రద్దయ్యింది. కాగా ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు సోమవారం మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో హెచ్పీసీఎల్ రాజస్తాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్లోని కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి.


