సాక్షి, న్యూఢిల్లీ: 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్సభలో గురువారం ఓటింగ్ జరిగింది. డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు విపక్షాలు డివిజన్ కోరాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు.
సభలో ఉన్న మొత్తం 333 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు. అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. మరో 86 మంది సభకు హాజరే కాలేదు. దీంతో డీలిమిటేషన్ బిల్లులపై సభలో చర్చకు మార్గం సుగమమైంది. అంతకు ముందు..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాక.. మూడు కీలక బిల్లులను లోక్సభలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘావాల్, అమిత్ షాలు ప్రవేశపెట్టారు. అయితే.. రాజ్యాంగ విరుద్ధంగా 131 సవరణ బిల్లు తీసుకొచ్చారని.. తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుపై చర్చకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డివిజన్ కోరగా.. చివరకు అత్యధిక ఓట్లు చర్చకు అనుకూలంగా పడ్డాయి.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. అలాగే లోక్సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి.


