ఉదయం 8 గంటలకు తెరుచుకోనున్న ఆలయ ద్వారాలు
ఈ ఏడాది రికార్డు స్థాయిలో 4.5 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్
సాక్షి, న్యూఢిల్లీ: కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తుల శివనామ స్మరణతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగి పోను న్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత అక్షయ తృతీయ శుభ ఘడియల్లో కేదార్నాథ్ ఆలయం తెరచుకుంటోంది. ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా డోలీ (ఉత్సవమూర్తి) ఇప్పటికే కేదార్నాథ్ ధామ్కు చేరుకున్నారు.
ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 14.5 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక్క కేదార్నాథ్ దర్శనం కోసమే 4,95,173 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 15,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఫోటోలు తీయడం, ఇన్స్టా గ్రామ్ రీల్స్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


