ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్‌ షా | Amit Shah pays tribute to brave personnel on Police Commemoration Day | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్‌ షా

Oct 21 2024 2:12 PM | Updated on Oct 21 2024 2:29 PM

Amit Shah pays tribute to brave personnel on Police Commemoration Day

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఎన్డీయే  ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. సోమవారం ఉదయం  ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్‌ షా నివాళులర్పించారు.

అనంతరం అమిత్‌ షా మాట్లాడుతూ..  జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని తెలిపారు.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని  అన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.

 ‘మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్‌, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది. అయినా మా పోరాటాన్ని ఆపం. కశ్మీర్‌లో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము’’ అని షా అన్నారు.

 

కాగా 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement