ఏటూరునాగారం: ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. పద్మశ్రీ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్స్లో కె.సరోజన అధ్యక్షతన జిల్లా స్థాయి సెమినార్ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఐసీడీఎస్కు తీవ్ర నష్టం కలిగించే విధంగా ప్రీ ప్రైమరీ విద్యను పాఠశాల విద్యలో కలపటం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4,131 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మంజూరు చేస్తూ సర్క్యూలర్ ఇవ్వడం దారుణమన్నారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్న ప్రీప్రైమరీ విద్యను అలాగే కొనసాగించాలని కోరారు. లేని పక్షంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సెమినార్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు రఘుపతి, వ్యకాస జిల్లా కార్యదర్శి దావూద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, పద్మారాణి, రమాదేవి, పార్వతి, లక్ష్మీ, నర్సమ్మ, సరిత, విజయలక్ష్మి, రత్నకుమారి, భిక్షపతి, భవాని, వనమాల, తదితరులు పాల్గొన్నారు.


