
తెలుగు రాష్ట్రాల్లో సినిమా బంద్ అంశంపై నూతనంగా ఎన్నికైన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శి శ్రీధర్ పలు వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలు తమకు దేవుళ్లు లాంటి వారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని పేర్కొన్నారు. థియేటర్ల బంద్ అంశాన్ని ఇద్దరు దర్శకులు, మరో ఇద్దరు నిర్మాతలు కలిసి పెద్ద వివాధంగా మార్చారని, త్వరలోనే వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తామని కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. థియేటర్స్ బంద్ అనేది తమ నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రకటన ఫిల్మ్ ఛాంబర్ చేయలేదన్నారు.
పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందని శ్రీధర్ వాపోయారు. ప్రస్తుతం ఒక్కో హీరో రెండేళ్లకో సినిమా చేయడం వల్ల సింగిల్ థియేటర్ల పరిస్థితి మనుగడ కష్టంగా తయారైందని ఆయన అన్నారు. హీరోలందరికీ స్టార్ హోదా రావడానికి కారణం ఎవరు..? వారు ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక రకంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం హీరోలు కూడా అని ఆయన అన్నారు.
రూ.10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే ఒక హీరోకి తదుపరి సినిమా కోసం రూ.30 లక్షలు నిర్మాతలు ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఒక సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ రూ. 2కోట్లు. కానీ, ఆ హీరోని పిలిచి రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని ఆయన వాపోయారు. అయితే, శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు 'జాక్' సినిమా గురించి అంటూ నెటిజన్లు ఆపాదిస్తున్నారు. ఈ సినిమా కోసం సిద్ధూ జొన్నలగడ్డ రూ. 13 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని, సినిమా డిజాస్టర్ కావడంతో ఆ చిత్ర నిర్మాతకు కొంత తిరిగిచ్చేశాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సినిమా పేరు చెప్పకపోవడంతో నెటిజన్లు మాత్రం వరుణ్ తేజ్, నితిన్ అంటూ ఎవరికితోచిన పేరు వారు చెప్పుకుంటూ పోతున్నారు.
అయితే, అధ్యక్షుడు సునీల్ నారంగ్.. హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడే హక్కు తమకు లేదని చెప్పుకొచ్చారు. కానీ, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలనేది తమ కోరిక అంటూ పేర్కొన్నారు. థియేటర్ల బంద్ వార్త విన్న తర్వాత తాను కూడా ఆశ్చర్యానికి లోనయ్యా అన్నారు. థియేటర్లకు సంబంధించి ఆ నలుగురు అనే వారు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. ఇందులో చాలామంది ఓనర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. సింగిల్ థియటర్స్ యాజమాన్యం కోరుతున్న పర్సంటేజ్ విధానం త్వరలోనే పరిష్కారం అవుతుందని సునీల్ నారంగ్ చెప్పారు.