మెదక్ కలెక్టరేట్: రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఈనెల 30తో ముగియనుంది. ప్రతి లబ్ధిదారుడు ఈకేవైసీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల అధికారులు చేపడుతున్నారు. జిల్లాలోని 21 మండలాలు ఉండగా 520 రేషన్ షాపులు ఉన్నాయి. 2,39,217 రేషన్కార్డులుండగా, 7,81,429 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 5,88,188 మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నట్లు తెలిసింది. మరో 1,93,241 మంది ఇంకా బయోమెట్రిక్ చేసుకోవాల్సి ఉంది. చేసుకోకపోతే రేషన్ బియ్యం పంపిణీ నిలిపివేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
గ్యాస్ లబ్ధిదారులు సైతం..
జిల్లాలోని గ్యాస్ గృహ వినియోగదారులు ఈనెలాఖరులోగా ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లేదంటే సబ్సిడీ నిలిచిపోతుందన్నారు. జిల్లాలో మొత్తం 52,047 మంది ఉజ్వల గ్యాస్ వినియోగదారులు ఉండగా, ఇంకా 5,168 ఇంకా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే జిల్లాలోని రిటైల్ పెట్రోల్ బంక్ల డీలర్లు హైస్పీడ్ డీజిల్ను ప్రతి వాహనానికి 200 లీటర్లకు మించి విక్రయించొద్దని హెచ్చరించారు. రిటైల్ డీలర్ల నుంచి అధిక మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసిన కొంత మంది ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఫలితంగా రైతులకు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. అక్రమ విక్రయాలను అరికట్టేందుకు డీలర్లంతా సహకరించాలన్నారు.
నెలాఖరుతో ముగియనున్న గడువు


