మహబూబ్నగర్ మున్సిపాలిటీ: దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయమని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో పార్టీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగుడి వద్దకు చేరుకుని సాధికారత కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. అంతకు ముందు దివ్యాంగులతో ముఖాముఖి సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా.. కొందరు దివ్యాంగులు తమకు ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ మంజూరు చేయాలని, ఉపాధి కోసం మోటారు వాహనాలు కావాలని, సదరం ధ్రువపత్రాల కోసం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు వెంకటేష్, కార్యదర్శి వీరేష్కుమార్, నాయకులు శ్రీనివాస్, బురానప్ప, ఇప్పటి నర్సింహులు పాల్గొన్నారు.


