మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో శనివారం సగటున వర్షపాతం 17.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గండేడ్ మండలంలో 78.9 మి.మీ., నమోదు కాగా, మహ్మదాబాద్లో 52.5 మి.మీ., కోయిలకొండలో 44.6 మి.మీ, మిడ్జిల్లో 31.3 మి.మీ, రాజాపూర్లో 27.2 మి.మీ, బాలానగర్లో 17.9 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ వాన పంటల దుక్కులకు దోహద పడుతుండడంతో రైతులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్నుంచి ఇందిరమ్మ ఇళ్ల మెటీరియల్ కాంపోనెంట్ ఎస్టిమేషన్ ప్రిపరేషన్, ఇందిరమ్మ ఇళ్ల ప్రపోజల్స్ స్టేటస్ రిపోర్ట్పై వీసీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన 90 రోజుల లోపల ఉపాధి హామీ పథకంలో భాగంగా పేమెంట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 5,972 ఇళ్లకోసం 3,493 ఉపాధి హామీ పథకం కింద పేమెంట్ కోసం మస్టర్డ్ ఇవ్వడం జరిగిందన్నారు. మిగతా 2,478 ఇళ్లకు ఈ నెలాఖరి వరకు ఎస్టిమేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సిములు, హౌసింగ్ పీడీ ఉపేందర్రెడ్డి, హౌసింగ్ డీఈ విజయ్కుమార్, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.
జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు.


