మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మిగతా డిమాండ్లపై కార్మిక సంఘాలతో టీజీఆర్టీసీ ఈడీల కమిటీ చర్చలు జరుపుతుందన్నారు. కార్మికుల భవిష్యత్తుకు పూర్తి భద్రత కల్పించడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్నారు. ఎప్పటిలాగే సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
● 3 అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక దృష్టి
● మహబూబ్నగర్ ఆర్ఎం సంతోష్కుమార్


