● ఏపీ జేఏసీ అమరావతి
జిల్లా చైర్మన్ కేవై కృష్ణ
కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ కేవై కృష్ణ విమర్శించారు. హామీల అమలు కోసం పోరాటాలకు దిగాలని ఉద్యోగులు నిర్ణయించారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగి మేలుకో–నీ భవిష్యత్ను కాపాడుకో అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అత్యవసరంగా ఏపీ జేఏసీ అమరావతి సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్ భద్రతకు సంబంధించిన ఎనిమిది ప్రధాన డిమాండ్లను అజెండాగా తీసుకుని సమావేశంలో సుధీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. గ్రామ, మండల, తాలూకా, డివిజన్, జిల్లా స్థాయిల్లోని ప్రతి ఉద్యోగి ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర నాయకత్వం చేపట్టే ఉద్యమ కార్యక్రమాలను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వం భవిష్యత్లో ఎలాంటి కార్యాచరణకు పిలుపునిచ్చినా కర్నూలు జిల్లాలో విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం ఉద్యోగి మేలుకో..నీ భవిష్యత్ను కాపాడుకో పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లక్ష్మీరాజు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కర్నూలు డివిజన్ అధ్యక్షుడు రామాంజనేయులు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు వెంకటరాజు, నాయకులు నాగరమణయ్య, శ్రీనివాసులు, సతీష్, సర్దార్, శంకరప్ప, బాను పాల్గొన్నారు.


