ఎమ్మిగనూరు రూరల్: ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు వస్తూ బైచీగేరి సమీపంలోని మలుపు దగ్గర మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన జేరుబండి ఉదయ్కుమార్ (20) అనే యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలు..పట్టణంలోని సోగనూరు రోడ్డులో నివాసముండే ఈ యువకుడు ఆదోనిలో బజాజ్ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ప్రతి రోజు పల్సర్ బైక్పై ఆదోని వెళ్లి జాబ్ చూసుకొని రాత్రి ఎమ్మిగనూరుకు వచ్చేవాడు. మంగళవారం రాత్రి పనిముగించుకొని ఇంటికి వస్తుండగా బైచీగేరి సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి సిమెంట్ కల్వర్ట్ను ఢీకొంది. ఈ ఘటనలో ఎగిరి కిందపడిపోయిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మోటార్ బైక్ బలంగా కల్వర్టుకు ఢీ కొట్టడంతో పెట్రోల్ లీకై ఆ వాహనం కాలిబూడిదైంది. అటుగా వెళ్తున్న వారు గమనించి అంబులెన్స్లో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి మృతుడి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉదయ్కుమార్ తండ్రి లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


