● విద్యుత్ శాఖ ఏఏఓ ఎస్జే చంద్రబోస్రావు
కర్నూలు (అర్బన్) : కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవారికి 20 కేవీ వరకు విద్యుత్ రాయితీ వర్తిస్తుందని విద్యుత్ శాఖ ఏఏఓ ఎస్జే చంద్రబోస్రావు చెప్పారు. బుధవారం స్థానిక బీసీ భవన్లో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి అధ్యక్షతన విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం–ఆర్థిక పారిశ్రామికాభివృద్ధి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఏఏఓ మల్లికార్జున మాట్లాడుతూ.. విద్యుత్ రాయితీ కోసం యూడీవైఏఎం రిజిస్ట్రేషన్ తప్పక చేసుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఏఈఓ నాగరాజు మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా కమ్మరి, వడ్రంగి, కంచరం, శిల్పం, స్వర్ణకార వృత్తుల వారికి 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు అందించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల శాఖ అధికారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలు, 35 శాతం సబ్సిడీ, నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
నూతన కమిటీల ఎన్నిక
విశ్వకర్మ పరిషత్ కర్నూలు, నంద్యాల జిల్లాలకు నూతన కమిటీలను ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షులుగా కమ్మరి తిమ్మయ్య ఆచారి, ప్రధాన కార్యదర్శిగా రమేష్ ఆచారి, కోశాధికారిగా ప్రదీప్ ఆచారి, ఉపాధ్యక్షులుగా వీరన్న ఆచారి, గిడ్డయ్య ఆచారి, కార్యదర్శిగా శ్రీరాం, కార్యనిర్వాహక కార్యదర్శిగా జీకే సతీష్ ఎన్నికయ్యారు. నంద్యాల జిల్లా అధ్యక్షులుగా విరాట్ వీరబ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శిగా నాగమహేశ్వరాచారి, కోశాధికారిగా వీర మహేంద్రాచారి, కార్యదర్శిగా చిన్నపుల్లయ్య ఆచారి ఎన్నికయ్యారు.


